స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1816* వ నాటి కొన్ని ఉద్వేగాలు (1.11.2019).
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1816* వ నాటి కొన్ని ఉద్వేగాలు (1.11.2019).
నేటి వేకువ ప్రశాంత వాతావరణంలో 3.57 – 6.20 నిముషాల నడుమ గంగులవారిపాలెం రోడ్డులో జరిగిన స్వచ్చ సుందరీకరణ కృషిలో స్థానికులతో సహా 33 మంది పాల్గొన్నారు.
ద్విముఖంగా సాగిన ఈ శ్రమదానంలో కొందరు దారి కిరు ప్రక్కల గడ్డిని చెక్కి, పిచ్చి మొక్కల్ని పీకి, కొన్ని పాత మొక్కల పాదుల్ని చక్కదిద్ది, దారి వైపుగా పెరుగుతున్న కొమ్మల్ని ట్రిమ్ చేస్తుండగా, మరికొందరు కొత్త పాదులు త్రవ్వి, 130 కి పైగా అడవి తంగేడు (గద్దగోరు) పూలమొక్కలు నాటారు.
అలస్టీనా చెట్లనడుమ ఒక ప్రణాళికా బద్దంగా నాటిన నిన్నటి- నేటి 150 కి పైగా ఈ మూడు రంగుల
పూల మొక్కలు పూర్తిగా పెరిగి, పూసినపుడు గంగులవారిపాలెందారి అందాలు గ్రామంలోని ఇతర రహదారుల్ని మించి పోవచ్చు!
నలుగురైదుగురు పనిరాక్షసులు ఏకంగా చీకట్లోనే లోతైన మురుగు కాల్వలో దిగి, గ్రామ మురుగు కడ్డ పడుతున్న, మునిగి ఉన్న తాడి చెట్టును, ఇతర పెద్ద ఎండు కొమ్మల్ని ట్రాక్టర్ సాయంతో బయటకులాగి, మురుగును ముందుకు నడిపిస్తున్న- వారి బట్టలు, మురుగు కారతున్న శరీరాల- దృశ్యంతో నావంటి ఒకరిద్దరు భావోద్వేగ భరితులయ్యారు.
మహిళా కార్యకర్తలు నేటి శ్రమదానం జరిగినంత మేర రోడ్డునుక్షుణ్ణంగా శుభ్రపరిచారు. సుందరీకరణ సభ్యులకు కూడ చేతినిండా కావలసినంత పని.
కొన్నివిరామాలతో రెండు వారాలుగా జరుగుతున్న గంగులపాలెం దారి స్వచ్చ సుందరీకరణ
కృషి నేటితో ముగిసింది.
ఈనాటి కార్యకర్తల సమీక్షా సమావేశంలో డిసెంబరు 21 వ తేదీ నాటి విశాఖ యాత్ర, నవంబరు 17 వ రోజు నాటి ఐదేళ్ల స్వచ్చ వేడుకల గూర్చి చర్చ జరిగింది. భవఘ్నినగర్ కు చెందిన మహిళాకార్యకర్త నేమాని పార్వతి ప్రవచించిన గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను పునః ప్రకటించి, 6.35 కు ఈనాటి గ్రామ కర్తవ్యదీక్షకు స్వస్తిచెప్పారు. ఈ వీధిలోనే 52 ఏళ్ల నాడు పుట్టి పెరిగిన వీరబాబు తమ వీధి ఇంత స్వచ్చంగా, శుభ్రంగా, అందంగా రూపొందుతుందని ఏనాడు ఊహించనే లేదని ఉద్వేగ భరితుడయ్యాడు. ఈ వేకువ మసక చీకటిలో స్వచ్చ కార్యకర్తల పని సందడికి రెండు సర్పాలు కంగారుగ తప్పుకుని వెళ్లిపోయాయి.
రేపటి స్వచ్చందశ్రమ దానం కోసం నాగాయలంక దారిలోని అమరవీరుల స్థూపం దగ్గర కలుసుకొందాం.
ఈ మద్యాహ్నం నాలుగు గంటల నుండి మన కోసం మనం ట్రస్టు గౌరవాధ్యక్షులు, స్వచ్చ సుందర చల్లపల్లి రూపకర్తలలో ఒకరు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి అభినందన (అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో) సభకు అందరం ఏక రూప దుస్తులలో హాజరవుదాం.
గమ్యం అవలీలగానే
గతానుగతికాలోచన కష్టం కాదే మాత్రం
గతం- వర్తమానాలను కలుపుచు-విశ్లేషిస్తూ
ప్రజల భవిత కొరకు క్రోత్త బాట వేయుటతి కష్టం
సాధించిన దవలీలగ స్వచ్చసైన్య మా గమ్యం!
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు – మనకోసం మనం ట్రస్టు
శుక్రవారం – 1/10/2019
చల్లపల్లి.
Powered by Facebook Like
Leave a Reply