పాగోలు రోడ్డు…. కొన్ని గురుతులు
పాగోలు రోడ్డు…. కొన్ని గురుతులు
పాగోలు రోడ్డులో మొక్కలకు కలుపు పెరిగింది. మనం ఓ రెండు రోజులు పనిచెయ్యాలని శాస్త్రి మాస్టారు చెప్పగానే రెండు సంవత్సరాల క్రితం పాగోలు రోడ్డు, అప్పటి స్వచ్ఛ కార్యక్రమం గుర్తుకొచ్చాయి.
ఒకసారి ఆనంద ఆదివారం కార్యక్రమం జరుగుతుంటే పాగోలు వాస్తవ్యులు, స్వచ్ఛ కార్యకర్త ‘కంఠంనేని రాంబ్రహ్మ్మం’ గారు నా దగ్గరకు వచ్చి ‘డాక్టరు గారూ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. ఉద్యమానికి మంచి పేరు వచ్చింది. పాగోలు రోడ్డును కనుక మనం శుభ్రం చెయ్యగలిగితే మరింత బాగుంటుంది’ ఆలోచించండి అని అన్నారు. వినగానే ఒక్క క్షణం భయపడ్డాను. ఆరోడ్డు పరిస్ధితి అలాంటిది. నానారకాల చెత్తతో డంపింగ్ యార్డులాగా ఉండటమే కాకుండా, పూర్తిగా బహిరంగ మలవిసర్జన జరిగే ప్రాంతం అది. అందులోనూ చల్లపల్లి పడమట వైపు మరుగుదొడ్లు లేని ఇళ్ళ స్త్రీలు పాగోలు రోడ్డునే తమ ఉదయపు అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించేవారు. మగవాళ్ళు నాగాయలంక రోడ్డుని వాడుకునేవారు.
బహిరంగ మలవిసర్జన ఆవాసాలుగా ఉన్న గంగులవారిపాలెం రోడ్డు, బైపాస్ రోడ్డులోని బాలికల హాస్టల్ ప్రాంతం, 6 వ నెంబరు కాలువ, తూర్పు వీధి చిన్న రాజా గారి ఇంటి ముందు, భారత లక్ష్మీ రైస్ మిల్ రోడ్డు, బండ్రేవుకోడు గట్టు – ఇన్ని ప్రాంతాల్లో పనిచేసి మలవిసర్జనను ఆపగలిగిన శక్తి స్వచ్ఛ కార్యకర్తలకు ఉన్నాగాని పాగోలు రోడ్డులో పనిచెయ్యాలంటే కొంత ధైర్యం కావలసి వచ్చింది. అంతకముందు సంవత్సరం మేము నాగాయలంక రోడ్డులో పనిచేస్తున్నప్పుడు యోగా మాస్టారు, డా. గోపాలకృష్ణయ్య గారు మరికొంతమంది కార్యకర్తలు పాగోలు రోడ్డు వద్ద ఆగి మలవిసర్జనకు వచ్చే స్త్రీలకు Counseling చేస్తుండేవారు. ఈ నేపధ్యంలో రాంబ్రహ్మ్మం గారి ప్రతిపాదనను కార్యకర్తలలో చర్చకు పెట్టాను. నేను భయపడినట్లు కాకుండా కార్యకర్తలందరూ ఉత్సాహంగానే ఒప్పుకున్నారు. చందమామ అపార్ట్మెంట్స్ కి కొంత మంది కార్యకర్తలు వెళ్ళి వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో వారు బహిరంగ మలవిసర్జన ఆపడానికి ప్రయత్నించినప్పుడు వచ్చిన ఇబ్బందులను తెలిపారు. స్వచ్ఛ కార్యకర్తలు ముందుంటే మళ్ళీ ప్రయత్నించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. చందమామ అపార్ట్మెంట్స్ వారు కొంతమందితోనూ, పాగోలు గ్రామస్తులు కొంతమందితోనూ, స్వచ్ఛ కార్యకర్తలు కలిసి నవంబర్ 20, 2016 న పాగోలు రోడ్డు శుభ్రపరచడం ప్రారంభించాం. వంతెన దాటగనే ఉన్న ప్రాంతమంతా డంపింగ్ యార్డులాగా వాడబడుతోంది. కంపు కొడుతున్న ఆ ప్రాంతంలో పనిచేయడం పెద్ద సవాలే! అయినా కార్యకర్తలు ఆ భాగాన్ని శుభ్రం చేసి పూల మొక్కలను నాటారు.
ఉదయం స్వచ్ఛ కార్యక్రమం జరుగుతున్న సమయంలో బహిరంగ మలవిసర్జనకు వచ్చే వారు లెట్రిన్ల్ కట్టుకోడానికి సాంఘిక ఒత్తిడి తీసుకురావడానికి యోగా మాస్టారు నారంశెట్టి వెంకటేశ్వరరావు గారి శిష్యులు అయిన పాగోలు స్కూలు పిల్లలు డప్పులు కొట్టుకుంటూ రోడ్డుపై తిరుగుతుండేవారు. మహాబోధి స్కూలు పిల్లలు ఆ రోడ్డులో ఉదయాన్నే అటుఇటు పరిగెత్తుతూ ఉండేవారు. యోగా మాస్టారు, డా. గోపాలకృష్ణయ్య గారు, డా. పద్మావతి గారు, మరికొంతమంది కార్యకర్తలు ఆ రోడ్డులో బహిరంగ మలవిసర్జనకు వెళ్ళే వారికి Counseling ఇస్తుండేవారు. ‘మాకు లెట్రిన్ల్ లేవు మేము ఎక్కడికి వెళ్ళాలి’ అని కొంతమంది గట్టిగానే ప్రశ్నించేవారు. లేనివారందరికీ లెట్రిన్ల్ కట్టించే ఏర్పాటు చేస్తాం అని సమాధానం చెప్పి ఒకరోజు ఆ ప్రాంతంలోని ఇళ్లవారందరినీ సర్వే చేయించాం. ఎవరెవరికి లెట్రిన్లు లేవో అర్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాదు గారు చల్లపల్లి లో టాయిలెట్స్ కట్టడానికి TATA ట్రస్టు వారిని తీసుకువచ్చారు. వారు ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజే ఒక టాయిలెట్ నిర్మాణం ప్రారంభించారు. గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉంది కనుక కాన్పు అయ్యేవరకు కట్టగూడదని, స్థల వివాదాలు ఉన్నాయని ఇలా రకరకాల కారణాలతో కొద్ది మందికి మాత్రం టాయిలెట్ కట్టడం కుదరలేదు. వెంటనే పరిష్కారం కోసం డా. పద్మావతి గారు మండలాధ్యక్షులు అయిన లంకబాబు గారితో MEO గారికి చెప్పించి అక్కడ ఉన్న ఒక స్కూలు టాయిలెట్ ను ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు వీరు ఉపయోగించుకునేట్లు గా ఒప్పించారు. టాయిలెట్ ను 4 గంటలకు తాళం తీయడం, శుభ్రం చేసి 7 గంటలకు తాళం వెయ్యడం ఒక మనిషికి అప్పగించారు. ఏరోజన్నా అతను రాకపోతే ‘పద్మావతి గారు’, మనకోసం మనం ట్రస్టు Supervisor ‘కస్తూరి శ్రీను’ టాయిలెట్ ని శుభ్రం చేసేవారు. ఆ తరువాత ఆ ప్రాంత వాసులకోసం నాగాయలంక రోడ్డులో ‘స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్’ ను కట్టడం జరిగింది. ఇలా పబ్లిక్ టాయిలెట్ సమస్య పరిష్కారం అయింది.
రోజూ ఉదయం 4.30 కే మేం వెళ్ళేటప్పటికే మేం పనిచేసే ప్రదేశంలో టాయిలెట్ తో నిండి పోయి ఉన్నా ఆ ప్రదేశంలో పనిచేసి చెత్తను, పిచ్చి మొక్కలను అన్నింటినీ తీసివేసి, శుభ్రం చేసి, పూల మొక్కలను నాటి ఎంతో అందంగా తయారుచేసిన కార్యకర్తలను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇలా పాగోలు గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చెయ్యడం జరిగింది. అంతకముందు గ్రామస్తులు పెట్టిన మొక్కలకు కంప కూడా కట్టారు. చివరలో ఒక ఆదివారం నాడు పాగోలు రైస్ మిల్ వారు కార్యకర్తలకు అల్పాహార విందును ఇచ్చారు. ఏమైనా రోడ్డు మొదట్లో కాపలా లేకపోతే చెత్త వేసే వారిని, మలవిసర్జనకు వచ్చే వారిని ఆపలేమని 8 గంటల డ్యూటీ చొప్పున కాపలా వారిని నియమించాం. కాపలా వారికి నీడ కోసం ఒక షెడ్ ను ‘మనకోసం మనం’ ట్రస్టు తరపున కట్టించాము. ‘మనకోసం మనం’ ట్రస్టు టాంకరుతో మొక్కలకు నీరు పోయించేవారిమి. 2017 జనవరి సంక్రాంతికి పాగోలు గ్రామస్తుల కలయికలో స్వచ్ఛ కార్యకర్తలను పిలిచి గౌరవించారు. ఆ సమావేశంలో ‘నెలకు 20 వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 2,40,000/- రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోగలిగితే కాపలా వారికి, మొక్కల సంరక్షణకు సరిపోతుంది. మీ రోడ్డు చాలా అందంగా ఉంటుంది. మీరే నిర్వహించుకుందురు గాని’ అని సలహ ఇవ్వడం జరిగింది. అయితే వారు అందుకు సిద్ధపడలేదు గాని దాదాపు 25 వేల రూపాయల విరాళం అందచేశారు.
అధ్వానంగా ఉండే పాగోలు రోడ్డును స్వచ్చంగా, సుందరంగా, హరితమయంగా చేయడానికి తమ శక్తియుక్తులను, సమయాన్ని కేటాయించిన కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ…..
– మీ సహకార్యకర్త
దాసరి రామకృష్ణ ప్రసాదు
30.11.2018.
Powered by Facebook Like
Leave a Reply