టీ షాపుల వద్ద పేపర్ కప్పుల చెత్త
చల్లపల్లిలో టీ షాపులవారు ప్లాస్టిక్ కప్పులను ఇవ్వడం ఏనాడో మానేశారు. సంతోషకరమైన విషయం. ఇప్పుడు పేపర్ కప్పులతో టీ, కాఫీలు ఇస్తున్నారు. సిద్ధిఖ్ లాంటివారు కొద్దిమంది మాత్రమే గాజుగ్లాసులతో టీ ఇస్తున్నారు. కొన్ని టీ షాపుల దగ్గర – ముఖ్యంగా కీర్తి హాస్పిటల్ దగ్గర ఉన్న రాజస్థాన్ టీ షాప్, బస్టాండ్ గేటు వద్ద ఉన్న టీ షాప్ దగ్గర కప్పులన్నీ రోడ్డు మీదే పడి ఉంటున్నాయి. ఈ షాపులవారికి చెప్పినా గానీ పెద్దగా ఫలితం ఉండటం లేదు. ‘టీ తాగేవారు చెత్తబుట్టలో వెయ్యడం లేదు, మేమేం చెయ్యగలం’ అనే సమాధానం వారి నుండి వస్తోంది. తాగేవారికి నచ్చచెప్పి చెత్తబుట్టలో వేసేట్లుగా చెయ్యడం, వెయ్యకపోతే షాపులో పనిచేసే ఒక మనిషే కిందపడిన కప్పులను తీసి చెత్తబుట్టలో వెయ్యడం, తద్వారా షాపు ముందు శుభ్రంగా ఉంచడం వారి బాధ్యతే కదా!
మన స్వచ్ఛ కార్యకర్తల సలహా అయితే ఇలా ఉంది:…..
‘అందరూ గాజుగ్లాసుల్లో టీ, కాఫీలిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది’ అని.
దీనికి కొంతమంది షాపులవారి వాదన….
‘కస్టమర్ లే పేపర్ కప్పులు అడుగుతున్నారు. మేమేం చెయ్యగలం’ అని.
స్వచ్ఛ సుందర టీ స్టాల్ ను నడిపే ‘సిద్ధిఖ్’ అందరికీ గాజుగ్లాసులు కానీ, గాజు కప్పులు కానీ ఇస్తున్నారు. మరి అతను చెయ్యగలిగినప్పుడు మిగతావారు ఎందుకు చెయ్యలేరు అని మన వాళ్ళు అంటున్నారు. ఆలోచించవలసిన విషయమే కదా!
ఈరోజు స్వచ్ఛ కార్యక్రమం అనంతరం జరిగిన చర్చలో సూచించబడిన పరిష్కారములు:
- రోడ్డు మీద కప్పులు వెయ్యకుండా చూడటం షాపువారి బాధ్యతే అని మళ్ళీ మళ్ళీ ఓపికగా కౌన్సిలింగ్ చెయ్యడం.
- అయినా గానీ ఏ టీ షాపు ముందు అయినా కప్పులు ఉంటే- ఉదయం పూట మన కార్యక్రమంలో ఉన్న కార్యకర్తలందరూ షాపు ముందు నుంచుని మౌనంగా నిరసన వ్యక్తం చెయ్యటం- గాంధేయ మార్గంలో.
- పంచాయతీ వారికి ఈ విషయాన్ని తెలియచెయ్యటం.
-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
07-05-2018
Powered by Facebook Like
Leave a Reply