కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!
‘అనితర సాధ్యం’గా చెప్పదగిన కఠిన శ్రమదానం - @2516*
25-8-22 (గురువారం) వేకువ జరిగిన ఆ కాయకష్టం మళ్ళీ హిందూ శ్మశానవాటికలో చిల్లలవాగు గట్టు వైపే! అందుకు పాల్పడింది 26 మందే! పని మొదలైన 10 నిముషాలకే సగం మంది బట్టలు చెమటకు తడవడం, ముఖాలు - చేతులు, స్వేదంతో తళతళ మెరవడం, ఐనా వదలక గంటన్నరకు పైగా వాళ్ల పోరాటం, ఇదంతా ఎవరి స్వార్దానికో కాక – ఊరంతటి ప్రయోజనార్ధం జరగడం – ఏ సాహిత్యకారులకైనా ఇంతకన్న మంచి కవితా వస్తువు దొరుకుతుందా!
అసలే అది శ్మశానం! దోమల ఉత్పత్తి కేంద్రాలైన మాచర్ల కంప, బాగా వేళ్లూనుకొన్న పిచ్చి – ముళ్ల – దురదగొండి మొక్కలూ – తీగలూ, వాటికి పట్టిన పురుగులూ, ఒక్కో మొక్కను ఒకటి కాదు - రెండు బలమైన దెబ్బలతో నరకడం - దానికి తోడు ఉక్క వాతావరణం – ఐనా సరే – పట్టువదలని విక్రమార్కుల్లా - వంగొని, మోకాళ్ల మీద కూర్చుని చేసిన శ్రమదానం! చేసే వాళ్ల సంగతేమో గాని - చూసే నాబోటి వాళ్లకు మాత్రం ఒళ్ళు జలదరించింది!
ఐతే - ఇదేదో ఈ ఒక్కనాటి కథకాదే! ఊళ్లో 2516* దినాలుగా ఊరి ఒక్కొక్క భాగంలో తీరుతున్న వ్యథ! దేశ సరిహద్దుల్లో – మంచుకొండా కోనల్లోని దేశ రక్షక సైనికుల నిత్య కర్మల వంటి – ఈ ఊళ్లో నిత్యమూ జరుగుతున్న వర్తమాన చరిత్ర!
ఈ రోజు ముగియాలని అంచనా వేసిన శ్మశాన కర్తవ్యం కొందరు కార్యకర్తల రాలేమి వల్ల అసంపూర్ణమయింది. శ్రమదానానికి కొద్దికాలం దూరమై, మళ్ళీ నేడు రంగ ప్రవేశం చేసిన కాంపౌండర్ వేంకటేశ్వరావు ముమ్మారు విస్పష్టంగా ప్రకటించిన స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య ప్రతిజ్ఞలతో 6.30 కి నేటి శ్రమదానం ముగింపు! చాల మంది కార్యకర్తల వాడిన ముఖాలూ - నొప్పి పట్టిన గూళ్లూ గమనించి చలించిన డాక్టర్ DRK గారు రేపటి మన శ్రమదానం ఈ శ్మశానంలో కాదనీ, చిల్లలవాగు వంతెన దగ్గర అనీ ప్రకటన - అందుకు అందరి ఆమోదం!
కావున రేపటి వేకువ మన పునర్దర్శనం బెజవాడ రోడ్డులోని తరిగోపుల ప్రాంగణం దగ్గరే!
- నల్లూరి రామారావు,
25.08.2022.