పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
గురువారం (8-2-24)నాటి శ్రమదాన సమాచారం - @ 3024*
అది చల్లపల్లి గ్రామ సమాజ బాధ్యులైన 33 మందికి సంబంధించినది; 3 ప్రధాన వీధుల -1 ½ కిలోమీటర్ల పారిశుద్ధ్య ప్రస్తావనమది ; ఇటు బందరు సువిశాల రహదారీ, అటు నాగాయలంక రోడ్డూ, కొసరుగా విజయవాడ వైపుగా కొంత భాగమూ స్వచ్చ- సుందరంగా మార్చిన 50 పని గంటల కష్టమది!
కొద్ది రోజుల ఎడం తర్వాత ఊరిని ముంచెత్తుతున్న మంచులో, వచ్చే పోయే వాహనాల్ని కాచు కొంటూనే:
- దుమ్ము-ఇసుకల మిశ్రాన్ని ట్రాక్టర్ లోకి లోడు చేసుకొంటూ 6 గురూ
- చీపుళ్లతో దుకాణాల ముందరి కసవుల్ని ఊడుస్తూ, కాగితమ్ముక్కల, కొద్దిపాటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఏరుతూ ఐదారుగురూ అటుగా వచ్చి పోతున్న వారికి బాధ్యతను గుర్తుచేస్తూ సాగిపోగా
- పెట్రోలు బంకు - విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ప్రాంతంలో చెట్టును క్రమబద్ధీ కరిస్తూ, తోపుడు బండి చుట్టూ గలీజుని శుభ్రపరుస్తూ, పిచ్చిమొక్కల్ని తొలగిస్తూ ఇంకొందరు శ్రమించారు.
- వీరి నుండి విడిపడి ఆరేడుగురు విజయవాడ రోడ్డులోని దుమ్మూ, ఇతర వ్యర్థాల పని బట్టారు.
ప్రభుత్వం పట్టించుకోని రోడ్డు గుంటల్ని మాత్రం ప్రస్తుతానికి పూడ్చ లేకపోయారు.
ఇసుకా దుమ్మూ ఒక వాహనం లోనూ, ఇతరేతర వ్యర్థాల్ని 2 వ దానిలోనూ సేకరించారు.
DRK గారు అనీ అనీ, వినే వాళ్లు వినీ- వినీ కాస్త విసుగు వస్తుందేమోగాని, “సమాజం లో గౌరవనీయ వ్యక్తులు ఈ రోజుల్లో ఇంత మురికి పనులు ఎవరు చేస్తారు?” అనే మాటలు పచ్చి నిజాలు!
నేటి సమీక్షా సమావేశానికి ప్రభుత్వం తరపున స్వచ్ఛ- శుభ్రతా ప్రవీణుడైన శ్రీనివాస్ గారు వేకువనే బయల్దేరికూడ రాలేకపోయారు.
నిన్న సాయంత్రం మన గ్రామ సర్పంచి, సెక్రటరీ, Dr. DRK- పద్మావతులూ, " స్వచ్చాంద్ర మిషన్ వారిని కలుసుకొన్న- సంప్రదించిన విశేషాలను కార్యకర్తలకు విశదీకరించారు.
గ్రామ ప్రథమ మహిళ గారి స్వచ్ఛోద్యమ నినాదాలతోనూ, రేపటి వేకువ మన కలయిక ఆగ్రహార వీధి దగ్గరనే నిర్ణయంతోనూ ఈనాటి శ్రమదాన కార్యక్రమం ముగిసింది.
అన కొండలు
ఊరి జనులు తోడొస్తే ఉత్సాహం రెట్టింపట
ఎవరొచ్చిన రాకున్నా ఈ ఉద్యమ మాగదటా
కాలుష్యం అన కొండలు కాటేయక ముందే తమ
ఊరిని రక్షించుటకై ఉరుకుతునే ఉంటారట !
- నల్లూరి రామారావు
08.02.2024