ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?
2413* వ వేకువ కూడ అదే బరువు పని
మంగళవారం సైతం అదే చోట – ఆ ఆరుగురు రెస్క్యూ టీం మనుషులే 4.26 నుండి 6.10 మద్య ఆ దహన వాటిక పడమటగా మళ్ళీ అదే బండ పని! (ఇవి నా మాటలే సుమా! ఊరి సౌకర్య మెరుగుదలే లక్ష్యంగా 8 ఏళ్లుగా శ్రమిస్తున్న కార్యకర్తలకు తమ గమ్యం వైపు ఒక్కో అడుగే తప్ప – ఇవి సుకుమార సేవలా, కఠిన చర్యలా, పత్రికల్లో మన ఫొటోలు పడతాయా, గుర్తింపులొస్తాయా,...వంటి ఆలోచనలు మచ్చుకైనా రావు! - ఊరికోసం చేతి చమురొదిలించుకొనే - విలువైన తమ కాలాన్ని సమర్పించే - చెమటలు చిందించే వాళ్లకు ఏ పనులైనా ఒకటే!)
తారు పెచ్చుల్నీ, ఇసుక - మట్టి – చిల్లర రాళ్ల మిశ్రాన్నీ డిప్పల్తో ట్రక్కులో నింపడం గాని, దానిని దించి, పారల్తో – చేతుల్తో సర్దడం గాని, అందు నిమిత్తం శ్మశానంలో – రాత్రి వేళ వేసవి ఉక్కతో చెమటలు దిగగార్చడం గాని ఇవన్నీ మొండి – బండ పనుల క్రిందే లెక్క! రోజుకు వెయ్యి రూపాయలిచ్చినా ఇలాంటి మురుగు – కంపు పనులకిప్పుడెవరూ దొరకని కాలం!
ఈ స్పచ్చ కార్యకర్తల పనిని ఆర్థిక ప్రమాణంతో కొలిచేకన్నా “అసలు వాళ్ల ప్రణాళికేమిటి? దాని వెనకున్న ఉద్దేశ్యమేమిటి? గ్రామ పౌరుల్లో ఎందరిలో వీళ్ళు ఏ మాత్రం సామాజిక స్పృహను తేగలిగారు....” వంటి అంచనాలు వేసుకోవడమే మంచిది. ఈ గ్రామస్తులు చాల విషయాల్లో చైతన్యవంతులై యుండి కూడ - ఇంత సుదీర్ఘ కాల శ్రమదానోద్యమం పట్ల ఇప్పటికీ చాలమంది అంటరానితనాన్నెందుకు పాటిస్తున్నారనే దానికి సమాధానం వెదకడం మరీ మంచిది!
ఏమైతేనేం – రెండు వారాల, నాల్లు పని దినాల రెస్క్యూటీం పంతం నెరవేరి, వాహనాలు నిలిపే చదును ప్రదేశం 95% సిద్ధమైపోయింది! వీళ్ళ పని ముగింపు వేళకు ముందే నలుగురైదుగురు పాదచారులు – వాళ్ళూ స్వచ్చ కార్యకర్తలే - గ్రామ సుందరీకరణ బాధ్యులే - వచ్చి, సంఘీభావం ప్రకటించారు! కోడూరు వేంకటేశ్వరుని గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య నినాదాలే మరొకమారు శ్మశానంలో ప్రతిధ్వనించాయి!
రేపటి బుధవారపు వేకువ మన పునర్దర్శనం బైపాస్ రోడ్డులోని పాత కస్తూర్బా ఆసుపత్రి దగ్గరే!
ఈ మహోత్కృష్ట శ్రమదానం ఏకొందరి పరిమితమా!
తలచుకొంటే – ముందుకొస్తే - అదేం పెద్ద అసాధ్యమా!
వెలుతురువలె - గాలి వలే వెలుగొందే నిస్వార్థత
అందరి కాచరణీయమె స్వచ్చోద్యమ విశిష్టత!
- నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యుడు
19.04.2022.