పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?
గ్రామ పారిశుద్ధ్య పాఠ్య గ్రంథంలో - @2656* వ పుట!
ఆ పేజీని 20-1-23 శుక్రవారం తమ శ్రమతో - చెమటతో లిఖించిన సామాజిక బాధ్యులు - చుట్టపు చూపుగా ఈ ఊరు వచ్చిన హైదరాబాదీ మహిళ – “మధు” గారితో సహా 31 మంది! బాగుపడిన వీధి - కోట మలుపు నుండి శివాలయం దిశగా బెజవాడ రహదారి, కొసరుగా పంచాయితీ కార్యాలయ వీధి ! రేపటికి ఇంకా మిగిలి పోయిన చోటులు - బ్రాహ్మణ కర్మల భవనం దగ్గర జానెడెత్తున పేరుకొన్న దుర్గంధమయ వ్యర్థాలూ, ‘శ్రీమంతు క్లబ్బు’ నుండి బెజవాడ దిశగానూ!
వేకువ 4.17 - నుండి 6.15 దాక సాగిన సుమారు 2 గంటల పారిశుద్ధ్య జైత్ర యాత్రలో ఇందరు కార్యకర్తల ప్రగతి 150 గజాలే! అందుకు కారకులు గ్రామ సామాజిక స్పృహ చాలని టీ దుకాణదారులూ, సిమెంటు కొట్ల వారూ, పచారీ వర్తకులూ! వాళ్లు ఏ కాస్త శ్రద్ధ చూపినా - టీ, కాఫీల కప్పులు, రోడ్డు మీద, సైడు కాలవల్లో కాక - డబ్బాలోనే ఉండేవి. దుకాణాల ఎదుట మురుగు కాల్వల్లో ఈ ప్లాస్టిక్ సంచులూ, గట్ల మీద పిచ్చి మొక్కలూ ఉండకపోను! రోడ్డు పడమర చెరువునూ, దాని చుట్టూ వృక్ష సంపదనూ - పక్షుల శ్రావ్య నాదాలనూ చూస్తే ఆహ్లాదం; దాని గట్టు మీద నికృష్ట వ్యర్థాలను చూస్తేనేమో దుర్భరం!
మెకానిక్ షెడ్ల ముందరా అంతే! వీటన్నిటినీ తుడుచుకొంటూ – ఊడ్చుకుంటూ - గడ్డినీ, పిచ్చి మొక్కల్ని తొలగించుకొంటూ ఆరేడుగురు కార్యకర్తలా వ్యర్థాలను ట్రాక్టర్లో నింపుకొంటూ శివాలయ ద్వారం దగ్గర ఆగిపోయారు! టీ కొట్టు ముందర నెలల తరబడీ వాళ్లు ఊడ్చిన దుమ్మూ – ఇసుకా గట్టిపడిన రెండు గుట్టల్ని గోకుడు పారల్తో – రైల్వే పారల్తో పెళ్లగించి, ట్రక్కులోకి చేర్చే పనే ఎక్కువ సమయం పట్టింది! పైగా అక్కడ గుడికి వెళ్ళే భక్తుల – టీ కాఫీ వాడకం దార్ల - మోటార్ సైకిళ్ల - ఇసుక బళ్ల రద్దీ!
తాము పదే పదే శుభ్రం చేస్తున్న - గుంటలు పూడుస్తున్న - ఖాళీల్లో పూలమొక్కలు నింపుతున్న రహదారిని ఇలా పట్టించుకోని, అస్తవ్యస్తం చేస్తున్న వారి పట్ల కార్యకర్తలెవరైనా విసుగూ – కోపమూ - చిరాకూ పడుతున్నారేమోనని ఆరా తీశాను. సమస్యల పరిష్కారాలను చర్చించడం తప్ప – వాళ్లు ఇతరులను తూలనాడడం కనిపించలేదు! ఒకటి రెండు దుకాణ పరిసరాలు శుభ్రంగా కనిపించాయి గాని – నిన్న శుభ్రపరచిన చోటులే 24 గంటలు గడవక ముందే - మళ్లీ చెత్తా - చెదారాలతో నిండిపోయాయి!
50 కి పైగా పని గంటల శ్రమానంతరం ఈ స్వచ్ఛంద కార్మికులు నేటి తమ ప్రయత్నంతో బాగుపడ్డ వీధి భాగాన్ని చూసుకొంటూ - రేపటి కర్తవ్యాన్ని తలచుకొంటూ - సరదా కబుర్లు చెప్పుకొంటూ - కాఫీ సేవిస్తూ వక్కలగడ్డ రామకృష్ణ హడావిడిగా చెప్పిన స్వచ్చ – సుందరోద్యమ గ్రామ నినాదాలందుకొంటూ - జాస్తి ప్రసాద్ గారి సోదరి - మధు స్పందనను ఆలకిస్తూ ...
6. 40 దాక గడపి గాని ఇంటి దారి పట్టలేదు!
రేపటి వేకువ మనం కలువదగిన చోటు శివాలయం దగ్గరే!
ఓమహాత్మా! ఓ మహర్షీ!
నీవు నేర్పిన విద్యలేమిటి? నేడు జరిగే తంతు లేమిటి?
హరిత సంపద – స్వచ్చ శుభ్రత అందలం ఊరేగుతుంటే-
“అందమే ఆనంద” మను కవి అంతరంగం బోధపడితే –
కార్యకర్తలె కాక ప్రజలూ కలిసి మెలిసీ శ్రమిస్తుంటే –
ఊళ్లు నందనమైతే దేశం ఉన్నత స్థితి చేరుకోదా?
“ఓ మహర్షీ! ఏది స్పందన? ఓ మహాత్మా! ఎచట బాధ్యత!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
20.01.2023.