అలుపెరుగని నిస్వార్ధ సేవకు నిదర్శనం చల్లపల్లి.
శ్రమజీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే సేవ.
ఆత్మీయతను పెంపొందించే సేవ
మనలోని ఆవేశకావేశాలను తగ్గించి
సహనం, ధైర్యం గుణాలను ప్రేరేపించే సేవ.
వయసు పైబడ్డా అదే పట్టుదల, అదే దీక్ష
డా.డీ.ఆర్.కే ప్రసాదు, డా.పద్మావతి గార్లు సంకల్పించిన రహదారి స్వచ్ఛతా యజ్ఞంలో
మేముసైతం అంటూ యజ్ఞసమిధలుగా
ఉన్న కార్యకర్తలు స్వచ్ఛ సుందర చల్లపల్లి రథాన్ని నిర్విఘ్నంగా, నిర్విరామంగా పరుగులు తీయిస్తున్నారు.
ఏం ఆశించి, ఏ లబ్ది పొందుదామని ఈ సేవ.
కేవలం సంతృప్తి, సంతోషం.
ప్రతిరోజూ పండుగ వాతావరణమే.
నాగాయలంక రోడ్డులో బ్రహ్మం గారి గుడి ప్రక్కన పోరంబోకు స్థలం ఉంది. అది అన్యాక్రాంతంలో ఉంది. దాన్ని గ్రామాధికారులు ఖాళీ చేయించగా అచట రహదారివనం ఏర్పాటయ్యింది.
ఓ రోజు సాయంత్రం 3 గం.కు ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం 6గం.కు పూర్తి అయింది. 39 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవాడ రోడ్డులో శ్రీమంతు రాజా వారి క్లబ్ పక్కన చెత్త డంపింగ్ చేసే స్థలంలో శుభ్రం చేసి పూల మొక్కలు నాటారు.
దానికెదురుగా ఓ రహదరి వనం ఏర్పాటు చేశారు. అదిగూడా చెత్త, మురుగుతో ఉన్న ప్రదేశమే. కస్తూరి మామ్మ గారి జ్ఞాపకార్ధం అచట వనం ఏర్పాటయింది.
600 రోజుల సేవ పూర్తి అయిన తరువాత
సాగర్ టాకీస్ నుండి బాలికల హాస్టల్ వరకు రహదారి వనం చేస్తే బాగుండును అనే సలహా వచ్చింది.
డా.గోపాలకృష్ణయ్యగారు, సజ్జా ప్రసాదు గారు మరికొందరు పరిసర గృహాలకు తిరిగి రహదారి వనం ప్రాముఖ్యత వివరించగా చాలా మంది విరాళాలు ఇచ్చారు. వాటితో ఆప్రదేశంలో రహదారి వనం ఏర్పాటయింది.
ఈరోజు బైపాస్ రోడ్డు చూస్తే ఎవరు ఊహించనంత మార్పు కనబడుతుంది.
రోడ్డంతా సువర్ణ గన్నేరులు, గన్నేరులు, దేవకాంచనాలతో కళకళలాడుతున్నది.
‘మనకోసం మనం’ ట్రస్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రహదారి వనాల రక్షణకు తోటమాలులను ఏర్పాటు చేశారు. వారికి తగిన వసతి కల్పించారు.
- ప్రాతూరి శాస్త్రి
11.09.2020.