పర్యావరణ హితంగానే జగన్ గారి తల్లి కమలాదేవి గారి కర్మకాండ.
నిన్న విజయవాడ లో జరిగిన నాగార్జున హాస్పిటల్ నిర్వాహకులు డా. కొడాలి జగన్మోహనరావు - శ్రీలక్ష్మి గార్లు జరిపిన శ్రాద్ధ కర్మలు, భోజనాలు ఎక్కడా వంక పెట్టలేని విధంగా పర్యావరణహితంగా జరగడం నేటి సమాజినికొక మంచి సందేశం. అన్ని వందల మంది భోజనాలలో పర్యావరణ హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ 99 శాతం కనిపించకపోవడమే ఒక పర్యావరణ విజయం.
ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ కోటెడ్ కంచాలు గానీ, గ్లాసులు గానీ ఆఖరికి స్పూన్లు గానీ, నీళ్ల సీసాలు గానీ కనిపించలేదంటే ఆ నిర్వాహకులు ఎన్ని రోజులుగా ఎంత జాగ్రత్త పాటించారో గ్రహించవచ్చు.
ఫ్లెక్సీ లు కాదు గదా కనీసం గుడ్డ బ్యానర్ కూడా పెట్టనే లేదు. భోజనాల బల్లపై ప్లాస్టిక్ పేపర్లు లేవు.
ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమాన్ని చిన్న పర్యావరణ లోపం కూడా లేకుండా నిర్వహించడమంటే ఏటికి ఎదురీదడమే.
అసలు దీన్నంతటినీ ఒక వీడియో తీసి అన్ని చోట్ల ప్రదర్శిస్తే ఒక మంచి పర్యావరణహిత సందేశమిచ్చినట్లేయ్యేది. ఏమైనా విజయవాడలో నిన్న జరిగిన ఉదాహరణ యోగ్యమైన ఈ కార్యక్రమ నిర్వాహకులను ఎంత అభినందించినా తక్కువే.
- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
చల్లపల్లి
28.12.2023